దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు..!
– అనుమతులు ఒకరికైతే.. తవ్వకాలు మరొకరివి
– బషీరాబాద్ ఎమ్మార్వో సీరియస్ యాక్షన్
– 5 ట్రాక్టర్లు, జేసిబి సీజ్, జరిమానా
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు రవాణా చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబితో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మండల తాహసీల్దార్ జేసిబి, ట్రాక్టర్లను సీజ్ చేసి భారీగా జరిమానాలను విధించారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు అజయ్ ప్రసాద్ అనే పేరుపై ఎర్రమట్టి తవ్వకాల కోసం 200 ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు.
అయితే మంగళవారం ఉదయం బషీరాబాద్ మండల కేంద్రంలోని స్మశాన వాటిక సమీపం నుంచి ఖలీద్ అనే వ్యక్తి ఎర్రమట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబితో తవ్వకాలు చేపట్టి 5 ట్రాక్టర్ల ద్వారా దర్జాగా రవాణా సాగించారు. ఈ విషయం మండల తాహసీల్దార్ వెంకటేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఎర్రమట్టి తరలింపుకు సంబంధించి అనుమతి పత్రాలను చూపించాలని కోరారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో జెసిబితో పాటు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఒక్కో టాక్టర్ కు రూ.5 వేల చొప్పున రూ. 25 వేలు, జేసిబికి రూ. 25 వేలు మొత్తం రూ. 50 వేలు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా తాహసిల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ అజయ్ ప్రసాద్ అనే వ్యక్తికి ఎర్రమట్టి రవాణాకు అనుమతులు ఇవ్వగా.. ఆయన కాకుండా ఖలీద్ అనే వ్యక్తి అక్రమంగా ఎర్రమట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జేసిబి, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని జరిమానా విధించడం జరిగిందన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్ కు అందిస్తామన్నారు. అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలకు, రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి…

