జాదుగాళ్లే.. వీళ్లు..!
– స్టైల్ బైకుతో గుట్టుగా గంజాయి రవాణా
– బైకుతో పాటు పట్టుకున్న టాస్క్ ఫోర్స్
– కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ వైపు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం, అధికారులు అవగాహన కల్పిస్తుంటే కొందరి యువకులు మత్తు విక్రయాలకు పాల్పడుతున్నారు. బైకుపై గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు జాదుగాళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలవేసి పట్టుకున్నారు. బైకుతో పాటు పోలీసులకు అప్పగించడంతో వారిపై కేసు నమోదయ్యింది. ఈ సంఘటన గురువారం తాండూరు సబ్ డివిజన్ కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి… తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరమ్మ కాలనీకి చెందిన వినోద్ కుమార్, రాజీవ్ కాలనీకి చెందిన మహమ్మద్ హర్షద్లు బైకు (టీఎస్08 జేవై 1433)పై వెళుతుండగా తాండూరు మండలం గౌతాపూర్ చెక్ పోస్టు వద్ద పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అడ్డగించారు. అదుపులోకి తీసుకుని పరిశీలించగా బైకులో 160 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. వెంటనే కరణ్ కోట్ పోలీస్టేషన్ కు తరలించి బైకుతో పాటు అప్పగించారు. ఈ మేరకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి.. బైకును స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

