రైతులకు ఇక ఆ సమస్యలే ఉండవ్..!
– సాదా బైనామాలకు లైన్ క్లీయర్
– నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఆ రైతులకు ఇది గొప్ప శుభవార్త. ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఇక నుంచి దూరం కానున్నాయి. రాష్ట్రంలోని 9.89 రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న సాదా బైనామాల భూముల క్రమబద్దీకరణకు తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెల్లకాగితంపై కొనుగోలు చేసిన భూములకు పక్కా పట్టాలు అందబోతున్నాయి.

గతంలో భూమి కొనుగోలు, అమ్మకాలు కేవలం కాగితాల ఒప్పందాలు, సంతకాలతోనే జరిగేవి. వీటిని సాదాబైనామాలు అని పిలిచేవారు. వీటి వల్ల రైతులకు బ్యాంకు రుణాలు లభించడం కూడా కష్టమయ్యేది. అయితే 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ ద్వారా సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించారు. కానీ ఆర్.ఓ.ఆర్. చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో హైకోర్టు స్టే విధించింది. దాదాపు 9.89 లక్షల మంది రైతుల దరఖాస్తులు నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తివేయడంతో, పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్గం సుగమమైంది. తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వల్ల సాదాబానామాలకు దరఖాస్తు చేసుకున్న 9.89 లక్షల మందికి లబ్ధిపొందనున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.

రైతులకు ఉపయోగాలు
ఈ నిర్ణయం రైతులకు పలు విధాలుగా ఉపయోగపడనుంది. భూమికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లభించడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతారు. తద్వారా రైతులు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వారసత్వం, విక్రయం, భూమి రక్షణ వంటి అంశాల్లో ఇకపై సమస్యలు తలెత్తవు. భూమి రికార్డులు పూర్తిగా పారదర్శకంగా మారి, దళారుల జోక్యం తగ్గే అవకాశముంది.

ఇదికూడా చదవండి…

