బెల్టు షాపుపై భగ్గుమన్నారు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బెల్టు షాపుపై భగ్గుమన్నారు..!
– ఎత్తివేయాలంటూ ఎక్సైజ్ ఆఫీసు ముట్టడి
– చర్యలు లేకపోతే ఆఫీసుకు తాళం వేస్తాం
– పాత తాండూరు ప్రజల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాత్రి, పగలు తేడా లేకుండా నిర్వహిస్తున్న బెల్టు షాపుపై తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు ప్రజలు భగ్గుమన్నారు. బెల్టుషాపు ఎత్తివేయాలంటూ తాండూరు ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు.

శనివారం ఎక్సైజ్ కార్యాలయం వద్ద పాత తాండూరు వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాత తాండూరులోని తెలుగు గడ్డ ప్రాంతంలో రెండు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాత్రింబవుళ్లు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడుతున్నారని, పెద్దలు. యువకులు మద్యానికి బానిసలు అవుతన్నారని అన్నారు. మద్యం విక్రయాల వల్ల పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
kvcs
మద్యం మత్తులో ఓ వ్యక్తి కూడా చనిపోయాడని గుర్తుచేశారు. బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎక్సైజ్ కార్యాలయానికి తాళం వేసేందుకు అయినా వెనుకాడేది లేదని హెచ్చరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఉన్నతాధికారులకు విషయం తెలిపి చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పడంతో ప్రజలు శాంతించి నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రం శ్రీధర్, గుండప్ప, పాత తాండూరు పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అట్లుంటది.. మరీ..!