మా వార్డులో సెల్ టవర్ నిర్మించొద్దు
– గాంధీనగర్లో ఇంటి ముందు ఆందోళన
– నిర్మాణ పనులు నిలిపివేసిన నాయకులు, ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మా వార్డులో సెల్ టవర్ నిర్మించొద్దంటూ తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు గాంధీనగర్లో ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి టీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో సెల్ టవర్ నిర్మిస్తున్న ఇంటి ముందు వార్డు ప్రజలు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బిడ్కర్ రఘు మాట్లాడుతూ వార్డులో జియో టవర్ నిర్మాణంపై వార్డు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

వెంటనే టవర్ ఏర్పాటు పనులను నిలిపివేయాలని మున్సిపల్ అధికారులను కోరడం జరిగిందన్నారు. అయినా టవర్ నిర్మాణ పనులు ఆపకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. వార్డు ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా సెల్ టవర్ నిర్మాణ పనులు చేపట్టొద్దని డిమాండ్ చేశారు. నిర్మాణ పనులను నిలిపివేశారు. మళ్లీ నిర్మాణ పనులు చేపడితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు దత్తాత్రేయ, యువకులు శివ, నర్సింలు, వార్డు పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

