అయ్యో.. నర్సయ్యా…!
– వాగులో కొట్టుకు వచ్చిన వ్యక్తి
– గమనించి కాపాడిన గ్రామస్తులు
– వీరెశెట్టిపల్లి బ్రిడ్జి వద్ద ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఉదృతంగా ప్రవహించిన కాగ్నానది వాగులో ఓ వ్యక్తి కొట్టుకు వచ్చాడు. గమనించిన గ్రామస్తులు తాళ్ల సాయంతో వ్యక్తిని ఒడ్డుకు చేర్చి కాపాడారు.

ఈ సంఘటన తాండూరు మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నానదిలో కొట్టుకుంటూ వచ్చాడు. వీర్ శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి.. మునుగుతూ.. తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు.

గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. వాగులోకి తాడు విసిరి.. నర్సయ్యను ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నర్సయ్యకు ప్రాణాపాయం తప్పినట్లు తెలిసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు చేసిన సాహసానికి పలువురు అభినందనలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

