పల్లెల్లో దారులకు రాజయోగం..!
– నియోజకవర్గానికి రూ. 6.12 కోట్లు
– జాతీయ ఉపాధి హామి కింద మంజూరు
– త్వరలో మరో రూ. 1.50 కోట్ల విడుదలకు అవకాశం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పల్లెల్లోని అంతర్గత రోడ్లకు రాజయోగం వచ్చింది. జాతీయ ఉపాధి హామి పథకం కింద గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ. 6కోట్ల 12లక్షల నిధులు మంజయ్యారు. ఈ నిధుల కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు.

ఈ నిదులు మంజూరైనట్లు మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. గ్రామాల్లో రహదారి సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే దాదాపు రూ.14.20 కోట్ల వ్యయంతో మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు గ్రామాల్లోని అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కావడం పట్ల పలు గ్రామాల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పనులు త్వరలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు వెల్లడించారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు దాదాపు రూ.20.3 కోట్లు మంజూరైనట్లు, మరో రూ.1.50 కోట్లు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలిపారు. నూతనంగా మంజూరైన ఈ పనులను నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.


