అందరు ఆస్తిపన్నులు చెల్లించాలి
– రెడ్ నోటీసులకు స్పందించకుంటే ఆస్తుల జప్తు
– కొత్త ఇంటి యజమానులు కూడా డిపాజిట్ చేయొచ్చు
– తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ ప్రజలు, వ్యాపారులు అందరు ఆస్తిపన్నులు చెల్లించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ పరిధిలో పెద్ద మొత్తంలో ఆస్తిపన్నుల బకాయిలు ఉన్నాయని తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 25శాతమే పన్నులు వసూలు చేయడం జరిగిందన్నారు. బకాయిలు ఉన్న యజమానులకు, వ్యాపారులకు ఇప్పటికే రెడ్ నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. రెడ్ నోటీసులకు స్పందించకుండా వారి ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆస్తి పన్నుల వసూళ్ల కోసం వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లను బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యజమానులు, వ్యాపారులు నేరుగా వారికి ఆస్తిపన్నులు చెల్లించవచ్చన్నారు. లేదంటే ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చని అన్నారు.

అదేవిధంగా ఆస్తిపన్నుల వసూళ్ల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యాలయంలో కూడా పన్నులు చెల్లించవచ్చని తెలిపారు. ముఖ్యంగా కొత్త ఇంటిని నిర్మించుకున్న వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని పన్నులు చెల్లించాలని అన్నారు. మరోవైపు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. వారు కూడా ఆస్తి పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.


