ప్రజా పాలనలో రైతులకు శాపం
– ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సర్కారు
– బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం
– తాండూరు మండల మహిళ కన్వీనర్ శకుంతల దేశ్పాండే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలన రైతులపై శాపంగా మారిందని, సర్కారు ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ తాండూరు మండల మహిళ కన్వీనర్ శకుంతల దేశ్పాండే అన్నారు.

తాండూరు మండలంలో బీఆర్ఎస్ నేతలను కరణ్ కోట్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు మద్దతుగా మంగళవారం తాండూరు మండలంలోని నేతలు పరిగికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులు చేశారు. మండలంలోని సీనీయర్ మహిళ నాయకురాలు శకుంతల దేశ్పాండే, పటేల్ ఉమా శంకర్ తదితరులను తెల్లవారు జామునే నిర్బంధించి పోలీస్టేషన్కు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల పాలిట శాపంగా మారుతున్న పాలన అని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.


