తాండూరులో నీటి కలుషితం లేదు
– మున్సిపల్ అధికారులకు పరీక్షల నివేధిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో కలకలం రేపిన అతిసార కేసుల్లో కొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి ప్రాంతంలో నీటి కలుషితం జరగలేదని శనివారం మున్సిపల్ అధికారులకు అందిన నివేధికలో తేలింది. తాండూరుు పట్టణంలో ఎక్కడ కూడా నీటి కాలుష్యం జరగలేదని తేలింది. గత రెండుు రోజుల క్రితం పాత తాండూరులో నమోదైన అతిసార కేసులని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ పాత తాండూరును సందర్శించిన విషయంం తెలిసిందే.
ఆయన సమక్షంలోనే వికారాబాద్ జిల్లా వైద్యాధికారులు మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. పాత తాండూరుకు నీటిని అందిస్తున్న ట్యాంకుల పరిసరాలను పరిశీలించారు. అక్కడ తాగునీటి నమూనాలను సేకరించారు. దీంతోపాటు తాండూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కూడా తాగునీటి నమూనాలను సేకరించి నీటి కలుషితంపై పరీక్షల నిమిత్తం పంపించారు. శనివారం వెలువడిన పరీక్షల ఫలితాలలో నీరు కలుషితం జరగలేదని తేలింది. మున్సిపల్ అధికారులకు అందించిన నివేధికలు ఫలితాలు స్పష్టం చేశాయి.
అయితే గత రెండు, మూడు రోజుల క్రితం జరిగిన జాతర ఉత్సవాలలో కలుషిత ఆహారం వల్లే అతిసార సోకిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు మున్సిపల్ తాగునీటిలో కలుషితం లేదని నిర్దారణ కావడంతో అధికారులు ఊరట చెందారు.
వైద్య శిబిరంతో సేవలు
పాత తాండూరులో అతిసార కేసులు వెలుగులోకి వచ్చిన మరుసటి రోజు నుంచి వైద్య ఆరోగ్య శాఖ్య ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలను అందిస్తున్నారు. ఇంటింటికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను అందజేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ అధికారులు సైతం స్థానిక ప్రజలకు తాగునీటి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తాగునీటిని కాచి వడబోసిన తరువాత సేవించాలని సూచిస్తున్నారు.

