ఆర్ఎస్కే ఫౌండేషన్ ఆపన్నహస్తం..!
– అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి చేయూత
– 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు
– పిల్లలకు దుస్తులు, విద్యాసామగ్రి అందజేత
– చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్ సేవా గుణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అగ్ని ప్రమాదం వల్ల అన్ని కోల్పోయిన కుటుంబానికి ఆర్ఎస్కే ఫౌండేషన్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది.

చైర్మన్ రోంపల్లి సంతోష్ కుమార్ కుటుంబానికి నిత్యవసర సరుకులు, ఇతర సాయం అందించి సేవా గుణం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన డ్రైవర్ వెంకట్ ఇల్లు వర్షం ప్రభావంతో విద్యుత్ షార్ట్సర్క్యూట్కు గురై పూర్తిగా దగ్ధమైంది.

దీంతో కుటుంబం నిరాశ్రయంగా మారింది. గ్రామ సర్పంచ్ శరణ్ స్వామి విజ్ఞప్తి మేరకు ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ రొంపల్లి సంతోష్కుమార్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం గ్రామానికి వెళ్లి సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయాన్ని అందించారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు పిల్లలకు దుస్తులు, నోట్బుక్స్, బ్యాగులు, ఇంటిపై కప్పేందుకు తాడిపత్రిని అందజేశారు.

ఆపద సమయంలో కుటుంబానికి అవసరమైన వస్తువులను అందించి అండగా నిలవడం పట్ల గ్రామస్తులు ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పరియాద రామకృష్ణ, పటేల్ కిరణ్, రఘునాథ్రెడ్డి, మహేష్, సోమశేఖర్, సత్యవర్ధన్, గురు తదితరులు పాల్గొన్నారు.


