దేహ దారుఢ్యంతో ఆరోగ్యం
– యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డర్కు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేహ దారుడ్యంపై దృష్టిసారించడం పట్ల ఆరోగ్యంగా ఉంటారని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సుల్తాన్బజార్లోని హనుమాన్ వ్యాయామశాలలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి దివంగత ఎం ముఖేష్గౌడ్ మెమోరియల్ ఆధ్వర్యంలో మిస్టర్ తెలంగాణ 2021 బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో తాండూరు అల్టిమేట్ జిమ్కు చెందిన షేక్ వాసిఫ్ పాల్గొన్నారు. 95 కేజీల విభాగంలో వాసిఫ్ తన కండలతో మెరిసి రెండో స్థానంలో రన్నర్గా నిలిచాడు. ఈ సందర్భంగా తాండూరు అల్టిమేట్ జిమ్ యజమాని మహమ్మద్ ఇజాజ్ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాడీ బిల్డర్ వాసిఫ్ను అభినందించి సన్మానించారు. అనంతరం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత దేహ దారుఢ్యంపై దృష్టిసారించాలన్నారు. శారీరక శ్రమ దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తుందని, దీని ద్వారా యువత ఆరోగ్యంగా ఉంటారన్నారు. యువత సెల్ ఫోన్, సిగరేట్, గుట్కా వంటి చెడు అలవాట్లకు బానిస కావొద్దన్నారు. అదేవిధంగా జిమ్ యజమాని, శిక్షకులు ఇజాజ్ మాట్లాడుతూ యుతవకు జిమ్లో అత్యుత్తమ సేవలందిస్తూ.. పోటీలలో సత్తా చాటేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ మాజీ అధ్యక్షుడు తాండూరు సిరాజ్ సందానీ, మాజీ కౌన్సిలర్ మహ్మద్ ఇర్ఫాన్, డాక్టర్ మహ్మద్ మెహరాజ్, సమీర్ ఫ్రూట్, మహ్మద్ షౌకత్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.

