భద్రేశ్వర్కీ.. జై..!
– వైభవంగా జాతర ఉత్సవాలకు అంకురార్పణ
– అట్టహాసంగా రథచక్రాలకు పూజలు
– పాల్గొన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, నేతలు
– జాతర క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ద భద్రేశ్వర దేవాలయం ప్రాంగణం, చౌరస్తా స్వామి వారి జై.. జై.. ధ్వానాలతో మార్మోగింది. ఉగాది సందర్భంగా భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ చేయడం ఆనవాయితి. ఇందులో భాగంగా ఆదివారం శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి యేడాది మాదిరిగానే ఉగాది పర్వదినంను పురస్కరించుకుని రథచక్రాలకు పూజలు నిర్వహించారు.

కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఆయన సోదరుడు బుయ్యని సత్యనారాయణ రెడ్డిల చేతుల మీదుగా దేవాలయ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ సమక్షంలో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. అనంతరం ఆలయ ఆవరణలో భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, వీరశైవ సమాజం సభ్యులు చేతుల ఆవిష్కరణ జరిగింది.

అదేవిధంగా దేవాలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం వినించారు. ఆద్యంతం వేదపండితుల పంచాంగ శ్రవణం ఆకట్టుకుంది. అంతకుముందు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఆయన సోదరుడు సత్యనారాయణ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దేవాలయంలో భద్రేశ్వరున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ నేతలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, డా. సంపత్ కుమార్, ఆలయ ఈఓ శేఖర్ గౌడ్, వీరశైవ సమాజం అధ్యక్షులు అర్.బస్వరాజ్, సభ్యులు పటేల్ శ్రీశైలం, వాలి శాంతుకుమార్, పసారం బస్వరాజ్, మాజీ కౌన్సిలర్ లావణ్య, రోహిణి, శెట్టి భాస్కర్, కోటం సిద్ధలింగం, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

