ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు విడుదల
– రాష్ట్ర వ్యాప్తంగా 49 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. గురువారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ బోర్డు మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఫలితాలను ఉంచింది. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించింది.
ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా..
– అధికారిక TSBIE వెబ్సైట్ tsbie.cgg.gov.inను సందర్శించాలి.
– ప్రధాన వెబ్సైట్ హోమ్పేజీలో ‘టీఎస్ మొదటి సంవత్సరం ఫలితం 2021’ లింక్పై క్లిక్ చేయండి.
– మీ లాగిన్ వివరాలను నమోదు చేసి, ఆపై ‘సబ్మిట్’ బటన్పై క్లిక్ చేయండి.
– అక్కడ మీ రిజల్ట్ కనిపిస్తుంది.
– మీ ఫలితాలను చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ నెలలో..
కాగా, మరో వైపు వచ్చే ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 23 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా తరగతులు సైతం ప్రారంభం కావడంలో ఆలస్యమైంది. దీంతో ఈసారి పరీక్షలు కూడా ఆలస్యంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.