బూస్టర్ డోసు టీకాతో ఆరోగ్యం పదిలం
– అందరు టీకా వేసుకోవాలి
– టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరోనా నియంత్రణలో భాగంగా వేస్తున్న బూస్టర్ డోస్ టీకాతో ఆరోగ్యాలు పదిలంగా ఉంటాయని టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని పీపీ యూనిట్లో కరణం పురుషోత్తంరావు, ఆయన సతీమణి కరణం సంధ్య, విశ్రాంత తహసీల్దార్ కరణం గోవింద్ రావు కుటుంబ సభ్యులు బూస్టర్ డోసు టీకాను వేసుకున్నారు. ఈ సందర్భంగా కరణం పురుషోత్తంరావు మాట్లాడుతూ కరోనా రెండో టీకా వేసుకున్న 60 ఏండ్లు నిండిన వారికి తొలి ప్రాధాన్యంగా బూస్టర్ డోసు టీకా వేస్తున్నారని అన్నారు. అర్హులందరు బూస్టర్ డోసు టీకా తప్పక వేసుకోవాలని అన్నారు. బూస్టర్ డోసు వేసుకోవడం వల్ల కరోనా, ఒమిక్రాన్ వైరస్ల నుంచి ఆరోగ్యాలను పదిలంగా కాపాడుకోవచ్చన్నారు. అదేవిధంగా రెండో డోసు, బూస్టర్ డోసు వేసుకున్నప్పటికి ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు, శానిటర్ వినియోగించి భౌతికదూరం పాటించాలన్నారు. దీంతో పాటు అర్హులందరు బూస్టర్ డోసు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్, వైద్య అధికారి కిషోర్, సిబ్బంది రేణుక తదితరులు పాల్గొన్నారు.

