ప్రభుత్వ బడులో బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అందించడంతో పాటు ప్రైవేటు పాఠశాలల పై ప్రత్యేక దృష్టి పెట్టి ఫీజులు నియంత్రించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గ పరిధిలోని 258 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. ఇందుకు మండలాల వారీగా నివేదికలు అందజేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈడిసి ఆధ్వర్యంలో తాండూరు మండలం జిన్గుర్తి సమీపంలో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. వచ్చేనెల ఫిబ్రవరి నెలాఖరున రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.

