భారత మహిళ పైలెట్ సాహసం
– 800 మంది భారతీయులను కాపాడిన మహాశ్వేత
దర్శిని డెస్క్: గత నెల 24న నుంచి ఉక్రెయిన్ – రష్యా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడ చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆపరేషన్లో ప్రభుత్వానికి దేశానికి చెందిన పైలట్లు తమవంతు సహకారం అందించారు. ఇందులో ఒకరైన కోల్కతాకు చెందిన మహిళ పైలెట్ మహాశ్వేత చక్రవర్తి కూడ ఉన్నారు. ఆపరేషన్ గంగాలో సేవలందించేందుకు భాగమైన మహాశ్వేత సాహసం చేసింది. పోలాండ్-హంగేరీ సరిహద్దు నుంచి 800 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. ఆమె చూపిన ధైర్యసాహసాలను బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ప్రియాంక శర్మ పైలట్ మహశ్వేత గురించి ట్వీట్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
మహాశ్వేత ఎవరంటే..
వార్తల్లో వ్యక్తిగా నిలిచిన మహాశ్వేత గురించి అందరు చర్చించుకుంటున్నారు. కోల్కతాకు చెందిన 24 ఏళ్ల మహశ్వేతా చిన్న తనం నుంచి పైలెట్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని.. అందుకు అనుగుణంగా కష్టపడి చదివింది. గత నాలుగేళ్లుగా ఇండిగో ఎయిర్ లైన్స్లో కో-పైలట్గా విధులు నిర్వర్తిస్తుంది. ఆపరేషన్ గంగా ప్రాజెక్టులో పాల్గొనాలని అర్ధరాత్రి ఫోన్ కాల్ రావడంతో.. ఆ తర్వాత వెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకొని విధుల్లో చేరింది. అనంతరం ఉక్రెయిన్కు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నది. పొలాండ్ నుంచి నాలుగు, హంగేరి నుంచి రెండు విమానాలకు పైలట్గా మహాశ్వేత పని చేసింది.

