నేటి నుంచి యాసంగి కొనుగోళ్లు
– 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం
– గతంలో మాదిరిగినే మిల్లులకు ధాన్యం తరలింపు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు (Paddy purchase) ప్రారంభంకానున్నాయి. ఈ సీజన్లో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సీజన్లో 15 కోట్ల గన్నీ సంచులు అవసరం ఉండడంతో ప్రస్తుతం కోటి 60 లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 8 కోట్ల గోనె సంచుల సేకరణకు 25న టెండర్లు పిలవనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మునుపటి మాదిరిగానే మిల్లులకు పంపనున్నారు. సాధారణ బియ్యంగా మార్చటం ద్వారా నూకలు అధిక శాతం రానున్న దృష్ట్యా మిల్లర్లకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, మిల్లింగ్ చేస్తే సూకలు ఎంత శాతం వస్తాయన్నది నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 236 కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటుచేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదని… రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునేది కేసీఆర్ ఒక్కరేనంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చోటు చేసుకున్న యుద్ద పరిణాలలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొంటారో లేదో ఆందోళన చెందారు రైతులు. ప్రతి గింజను మేమే కొంటామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

