నో డౌట్.. ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే..!
– వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ
– మున్సిపల్లో ఒప్పందాన్ని శిరసావహించాల్సిందే
– పార్టీ బలోపేతానికే యాలాల అధ్యక్షుడి మార్పు
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నానని, ఇందులో 0.1 శాతం కూడ డౌట్ లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడీయాతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల విషయంలో అభ్యర్థిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దీనిపై కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తప్పుకుండా పోటీ చేస్తానని, అధిష్టానం తనకే టిక్కెట్ ఇస్తుందన్నారు. ఇందులో 0.1 శాతం కూడ డౌట్ లేదని, రూమర్స్ నమ్మాల్సిన పనిలేదన్నారు. మరోవైపు తాండూరు మున్సిపల్ ఒప్పంద రాజకీయంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఒప్పందం జరిగిందని, దానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో పాటు యాలాల మండల అధ్యక్షుని మార్పు విషయంలో ఎలాంటి వివాదాల్లేవన్నారు. పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని చురుకుగా పనిచేసే రవీందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగిందని చెప్పుకొచ్చారు. కొందరు జిల్లా అద్యక్షుని కలవడం, మళ్లీ మల్లారెడ్డి యాలాల మండల అధ్యక్షులుగా కొనసాగుతారని వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. నియోజకవర్గంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారిపై అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

