ఎమ్మెల్సీ ఖబడ్దార్..!
– రౌడీషీటర్లెవరో చెప్పి తీరాలి
– మహేంద్రుడిపై మండిపడిన ఎమ్మెల్యే వర్గీయులు
– తాండూరులో అర్దరాత్రి దాక హైటెన్షన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేసిన వాఖ్యలు తాండూరు టీఆర్ఎస్ రాజకీయాల్లో నిప్పులు రాజేశాయి. ఎమ్మెల్యే వర్గీయులను రౌడీషీటర్లంటూ సంబోధించడంతో ఉద్రిక్తతకు దారితీశాయి. ఎమ్మెల్సీ వాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే వర్గీయులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ఆర్దరాత్రి దాక కొనసాగింది. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజుగౌడ్, శ్రీనివాస్ చారి, బంటారం సుధాకర్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ తదితరులు పట్టణంలోని పోలీస్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాలతో చౌరస్తా మార్మోగింది. భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో రోడ్డు మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే వర్గీయులను రౌడీషీటర్లు అంటారా అంటూ మండిపడ్డారు. రౌడీషీటర్లు ఎవరో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాండూరు ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాండూరులో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిని తిట్లతో బెధిరించినందుకు కూడ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణ పోలీసులకు ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్రిక్తతంగా మారిన ఆందోళన
మరోవైపు తాండూరు పట్టణ పోలీస్టేషన్ ముందు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేపడుతున్న సమయంలో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన ఆశోక్ అనే యువకుడు అక్కడి రావడం, ఫోటోలు తీయడంతో నేతలు హెచ్చరించారు. మాటామాట పెరగడంతో ఎమ్మెల్యే వర్గీయులు అతనిపై దాడిచేసి చితకబాదారు. అక్కడే ఉన్న పోలీసులు కల్పించుకుని అతన్ని అక్కడి నుంచి తరలించారు. దీంతో పాటు చౌరస్తాపై ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఫ్లెక్సీని కొందరు ద్వంసం చేశారు. అర్దరాత్రి దాక జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

