చిల్లర రాజకీయాలతో నష్టం
– వర్గపోరుతోనే తాండూరు అభివృద్ధి దూరం
– టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గపోరుతో చిల్లర రాజకీయాల వల్ల ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.రమేష్ మహరాజ్ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండించారు. శాంతిభద్రతలు, ప్రజా సంరక్షణలో కీలకమైన పోలీసు అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదన్నారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాండూరులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గపోరు వల్ల అభివృద్ధి జరగడంలేదన్నారు. వివిధ కార్యక్రమాలలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. నిత్యం వర్గపోరులో చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే వ్యవహరిస్తున్నారని అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.


