రైతులకు శుభవార్త..!
– తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కంది విత్తనాలు
– ఈనెల 24 నుంచి అందుబాటులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ రైతులకు స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. వానాకాలంలో కంది పంట సాగుచేసే రైతుల కోసం కంది విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పరిశోధన స్థానంలో టీడీఆర్జీ-59, హనుమ(టీడీఆర్జీ-4), ఆశ(ఐసీపీఎల్ 7119) రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. 5 కిలోల విత్తనాలను రూ. 520లకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆయా రకాల విత్తనాలు 116 క్వింటాళ్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, రైతులు త్వరపడి విత్తనాలను పొందాలని సూచించారు.

