పార్టీలకతీతంగా పట్టణ అభివృద్ధి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– 13వ వార్డులో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్టీలకతీతంగా పట్టణ అభివృద్ధికి అందరు తోడ్పడాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 13వ వార్డులో 14వ ఆర్థికసంఘం నిధులు రూ. 7లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ ఆర్డీఓ అశోక్ కుమార్తో పాటు వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మాట్లాడుతూ..గెలుపోటమి వరకే పార్టీలని తర్వాత అందరం కలసి పనిచేస్తూ తాండూరు పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కాలనీలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరు తడి, పొడి చెత్త వేరువేరుగా చేసేటట్లు చెత్త బుట్టలను ఏర్పాటుచేసుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథన్, ఫారెస్ట్ ఆఫీసర్ శ్యామసుందర్, అధికారులు రమేష్, స్పెషల్ ఆఫీసర్ మధుమతి, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, నాయకులు ఎర్రం శ్రీధర్, కల్వ వంశీ, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



