రెచ్చిపోయిన దొంగలు
– మోబైల్ షాపులో చోరీ
– విలువైన ఫోన్ల ఆపహరణ
తాండూరు దర్శిని ప్రతినిధి : తాండూరులో గుర్తుతెలియని దొంగలు రెచ్చిపోయారు. మోబైల్ షాపు షెట్టర్ను ధ్వంసం చేసి చోరబడి విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం ఖాంజాపూర్కు చెంది యువకుడు పట్టణంలోని నెహ్రు గంజ్ రోడ్ పెట్రోల్ బంక్ సమీపంలో బాలాజీ కమ్యూనికేషన్ పేరుతో మోబైల్ షాపు, ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి యధావిధిగా షాపు మూసేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారు జామున షాపు షెట్టర్ ధ్వంసం అయిన విషయం గుర్తించిన స్థానికులు యజమానికి సమాచారం అందించాడు. దీంతో పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షాపును పరిశీలించారు. షాపులో ఏయే వస్తువులు చోరీ అయ్యాయి..? ఎవరు దొంగతనానికి పాల్పడ్డారు..? అనే విషయాలపై ఆరా తీశారు. అయితే షాపులో విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమేం చోరీ అయ్యాయనే విషయాలను పోలీసులు, యజమాని వెల్లడించలేదు. కాని షాపులో సుమారు రూ. 4లక్షల విలువ చేసే 20 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. గత యేడాది క్రితం కూడ ఇదే షాపులో చోరీ జరిగింది. ఇది రెండోసారి.



