ఆర్టీసీకీ డిజిటల్ తోడు
– చిల్లర సమస్యకు చెక్
– బస్సుల్లో చెల్లింపుకు పరికరాలు
– త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఆర్టీసీలో ప్రయాణికుల చిల్లర సమస్యలకు కాలం చెల్లిపోనుంది. ప్రజలు డిజిటల్ చెల్లింపుల్లో విరివిగా వినియోగిస్తున్న యూపీఐ సేవలను తోడు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రయాణికుల నుంచి డిజిటిల్ చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తేబోతోంది. టికెట్కు సరిపడా చిల్లర లేక కండక్టరు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఈ డిజిటల్ విధానం సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్టీసీ ప్రయాణీకులు ఇకపై నగదు లేకుండా డిజిటల్ చెల్లింపుల( ఫోన్ పే, గూగుల్ పే, స్వైప్, ఎ. టి. యం కార్డు) ద్వారా ఆర్టీసి బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఇప్పటికే మహబూబ్నగర్, నిజామాబాద్ తదితర డిపోల పరిధిలో తిరుపతికి వెళ్లే బస్సులో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేక పరికరాలను అమల్లోకి తెచ్చారు. మొదట దూర ప్రాంతాల సర్వీసులు, ఏసీ బస్సుల్లో ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. దశల వారీగా అన్ని బస్సు సర్వీసుల్లోనూ ఈ విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులు, కండక్టర్లకు చిల్లర బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.


