బ్యాడ్ పోలీస్..!
– దళిత మహిళపై విచారణ వేధింపులు
– ఫ్రెండ్లీ పోలీసింగ్కు మచ్చ
– సీఎం సొంత జిల్లాలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఫ్రేండ్లీ పోలీసింగ్ విధానం అమలు అవుతోంది. పోలీస్టేషన్కు వచ్చే వారిపై మర్యాదగా మెలగాల్సింది ఓ ఎస్ఐ వ్యవహారం వల్ల బ్యాడ్ పోలీసింగ్ అంటూ విమర్శల పాలు చేస్తోంది. విచారణ పేరుతో ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అది కూడా సీఎం సొంత జిల్లాలో జరగడంతో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… బషీరాబాద్ మండలం నవాల్గా గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు గత మే నెలలో ఓ బాలికను తీసుకుని వెళ్లిపోయాడు.
బాలిక తల్లిదండ్రులు యువకుడిపై కిడ్నాప్(అపహరణ) చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై యువకుడి తల్లి కళావతిని పోలీసులు పోలీస్టేషన్కు పిలిపిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే కళావతి పోలీసులు పిలిచినప్పుడల్లా బషీరాబాద్ పోలీస్టేషన్కు వెళుతోంది. విచారణ పేరుతో పోలీసులు తనను కొడుకు ఆచూకీ చెప్పాలంటూ వేధిస్తున్నారని వాపోయింది. అంతేకాకుండా చేతులు, కాళ్లపై కొట్టారంటూ ఆరోపించింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ స్పందిస్తూ వెలుగులోకి వచ్చిన సంఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు.
ఇదికూడా చదవండి…

