ఇందిరమ్మ ఇండ్లపై సర్కారు ఫోకస్..!
– ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్
– ప్రకటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా లబ్దిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్ను శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం తెలిపారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇందుకు చేయాల్సిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని యాప్లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని సూచించడం జరిగిందన్నారు.
లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయింపు వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంతవరకు వినియోగించుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఈ యాప్లో ఒకటి రెండు మార్పు చేర్పులను మంత్రి సూచించారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేసి వచ్చే వారంలో యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇదికూడా చదవండి…

