భద్రేశ్వర జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 15 నుంచి ప్రారంభమవుతున్న తాండూరు భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం తాండూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతర ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖల అధికారులో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

భద్రేశ్వర జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు అయిన రథోత్సవం, లంకాదహనః వేడుకలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి యేడాది మాదిరిగానే రెవెన్యూ, మున్సిపల్ శాఖల తరుపునుంచి ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరలో మద్యం అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్ శాఖ దృష్టిసారించాలన్నారు. జిల్లా ఆసుపత్రి నుంచి జాతరలో ప్రజల కోసం వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. పశువుల సంతో పశువైద్య అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

తాండూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ నుంచి రవాణా సర్వీసులు అందించాలన్నారు. జాతరలో విద్యుత్ సమస్యలు రాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జాతర ఉత్సవ కమిటి సభ్యులు జాతర ప్రశాంతంగా జరిగేలా సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, భద్రేశ్వర రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, తహసీల్దార్ తారాసింగ్, పట్టణ సీఐ సంతోష్ కుమార్, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డా.ఆనంద్ గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటి కార్యదర్శి శ్రీనివాస్, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్, మున్సిపల్, ఫారెస్టు, దేవాలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి….

