పురుడు కోసం వస్తే ప్రాణం పోయింది..!
– తాండూరు ఎంసీహెచ్లో గర్భిణీ మృతి
– కడుపులోనే 8నెలల శిశువు కన్నుమూత
– వైద్యుల నిర్లక్ష్యమే అన్న కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పురుడు కోసం వస్తే ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. తల్లితో పాటు కడుపులో ఉన్న 8నెలల శిశువు కూడా కన్నుమూసింది. ఈ సంఘటన తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండాకు చెందిన సుమిత్రా బాయి, జైసింగ్లు భార్య భర్తలు. వారికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

నాలుగో సారి సుమిత్రాబాయి 8నెలల గర్భిణిగా ఉంది. శనివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంభీకులు తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మతా శిశు ఆసుపత్రికి తీసుకవచ్చారు. ఉదయం 6 గంటలకు తీసుకవస్తే 7-30 గంటలకు వైద్యులు స్పందించి ప్రసవం కోసం తీసుకవెళ్లారని భర్త జైసింగ్ తెలిపారు. కాసేపటికే సుమిత్రా బాయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని అన్నారు. సుమిత్రా బాయికి చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ కారణంగానే మృతి చెందిందని అన్నారు. మరోవైపు వైద్యులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన సుమిత్రా బాయికి రక్తం తక్కువగా ఉందని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా కూడా సీపీఆర్ చేస్తూ వైద్యం అందించడం జరిగిందని అంతలోనే సుమిత్రా బాయి ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయలేదని చెప్పుకోచ్చారు. తల్లీ, శిశువు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

ఇదికూడా చదవండి…


