మట్టి గణపతులే మేలు..!
– ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంక నర్సింలు
– వినాయకులను కొనుగోలు చేసిన యువసేన సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి గణనాథులను ప్రతిష్టించడమే మేలు అని ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంక నర్సింలు అన్నారు. మంగళవారం లొంక నర్సింలు యువసేన సభ్యులతో కలిసి తాండూరు మండలం దస్తగిరి పేట్ గ్రామాన్ని సందర్శించారు.

వినాయక చవితి సందర్భంగా గ్రామంలో కుమ్మరి శంకరయ్య తయారు చేసిన మట్టి గణపతులను పరిశీలించారు. పర్యావరణ హితంలో భాగంగా మట్టి వినాయకులను తయారు చేయడాన్ని అభినందించారు. పండగ సందర్భంగా మట్టి వినాయకులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా లొంక నర్సింలు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను సహజ సిద్దంగా జరుపుకోవాలన్నారు.

పండగలో మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలన్నారు. మట్టి వినాయకులను ప్రతిష్టించి.. నిమజ్జనం చేయడం పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. అదేవిధంగా చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు లొంక రాములు, సంగమేశ్వర్, రాములు, శ్రీను, రవి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

