క్యాన్సర్పై భయాందోళనలు వద్దు..!
– వ్యాధి నివారణకు ఆధునికి చికిత్సలు
– యశోధ ఆసుపత్రి వైద్యులు డా.సచిన్ మర్దా
– తాండూరులో ఐయామ్ అన్ స్టాపబుల్ పుస్తకావిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేటి ఆధునిక సమాజంలో కూడా క్యాన్సర్ వ్యాధి అంటే అందరు భయాందోళనకు గురవుతున్నారని, ఈ వ్యాధిపై ఉన్న ఆపోహలను అందరు వీడనాడాలని హైదరాబాద్ యశోధ ఆసుపత్రి వైద్యులు డా.సచిన్ మర్దా అన్నారు.

బుధవారం తాండూరు పట్టణంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన డా. సచిన్ మర్దా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. నేటి ఆహారపు అలవాట్లతో పాటు ఇతర కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని నాలుగు దశల్లో గుర్తించవచ్చని అన్నారు. మొదటి దశలోనే గుర్తిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తరువాత దశలలో కిమో థెరపీ, రేడియేషన్ తదితర పద్దతులతో నయం చేయవచ్చని అన్నారు.

ప్రస్తుతం ఆధునిక పద్దతులతో చికిత్స అందించే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. రోబోటిక్ చికిత్స ద్వారా క్యాన్సర్ను నయం చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా యశోధ ఆసుపత్రి ప్రతినిధి పరమేష్ మాట్లాడతూ హైదరాబాద్లోని సోమాజీగూడ యశోధ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఆదునిక చికిత్సలు అందించడంతో దేశంలోనే రెండో ఆసుపత్రిగా యశోధ ఆసుపత్రి నిలిచిందని అన్నారు. పేదలకు ఇన్సురెన్స్, కంపెనీల బీమాలతో క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించడం జరుగుతుందని, క్యాన్సర్ వ్యాధి చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం యశోధ ఆసుపత్రి వైద్యులు డా.సచిన్ మర్ద రెండేళ్ల పాటు శ్రమించి రాసిన ఐయామ్ అన్ స్టాపబుల్ అనే పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


