జిల్లా ఆసుపత్రి పురోగతిపై దృష్టి..!
– రోగులకు మెరుగైన వైద్య సేవలు
– వైద్యులు సమయ పాలన పాటించాలి
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
– తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పురోగతిపై దృష్టిసారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.

బుధవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర వార్డు, స్కానింగ్ రూం, డయాగ్నోస్టిక్ సెంటర్, బ్లడ్ బ్యాంకు, జనరల్ వార్డ్, ఐసిటిసి ల్యాబ్, గర్భిణీ లకు చికిత్స అందించే సెంటర్ ను, మహిళా వార్డుతో పాటు తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంత మంది వైద్యులు ఉన్నారు..? మందులు అందుబాటులో ఉన్నాయా..? ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు.

వైద్యులతో మాట్లాడుతూ ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. రోగులకు అందుబాటులో ఉండేందుకు వైద్యులు సమయ పాలన పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించి పురోగతికి దృష్టిసారించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో పారిశుధ్ద్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పలు శాఖల సహాకారంతో ఆసుపత్రి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ కర్ర అనిత, నర్సింగ్ కాలేజీ అధికారులు, డీసీహెచ్ఎస్ డా.ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


