తాండూరు ఎమ్మెల్యేకు సైబర్ వల..!
– ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీని అంటూ ఫేక్ కాల్
– అప్రమత్తమైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసేందుకు యత్నించారు. తాను ఆర్థిక శాఖ ప్రభుత్వ చీప్ సెక్రటరీని అంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫేక్ కాల్ చేశారు.

ఈ విషయాన్ని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మనోహర్ రెడ్డికి ఫోన్ చేసిన వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరిచయం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ “దిలీప్ కుమార్” పేరుతో ఎమ్మెల్యేకు ఫోన్ చేసినట్లు వివరించారు.

అయితే ఇటీవల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా ఇలాంటి నకిలీ కాల్ వచ్చిన ఘటన, దానిపై ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియోను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తం అయ్యారు. తనకు వచ్చిన ఫోన్ కాల్ మోసం చేయడానికే వచ్చిందని దృవీకరించుకున్నారు. అనంతరం వికారాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ పేర్లతో ఫోన్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే నకిలీ గుర్తింపులతో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం, సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


