గురుభ్యో నమః.. గురువులకు ఘన సన్మానం
– శ్రీసాయి మేధాలో సర్వేపల్లికి ఘన నివాళి
– ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత తొలి ఉపరాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని తాండూరు శివాజీక్లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను నిర్వాహకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి చీకటి నుంచి వెలుగులోకి నడిపించే మార్గదర్శకులే గురువులని అన్నారు. భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తును తరగతి గదిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సమాజంలో బాధ్యతగా జీవించే విధానాన్ని బోధించాలని సూచించారు. సాధారణ రాయిని శిల్పంగా తీర్చిదిద్దే శిల్పిలా.. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
విద్యార్థులు గురువుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, తల్లిదండ్రులు సైతం పిల్లల చదువు, ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ప్రోత్సహించాలని వెంకట్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


