యువత క్రీడల్లో రాణించాలి
– ముగిసిన వీరశైవ సమాజం వాలీబాల్ టోర్నమెంట్
– నగదును, ట్రోఫీలు అందజేసిన అధ్యకక్షులు పటేల్ శ్రీశైలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత క్రీడల్లో రాణించాలని తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం అన్నారు. గత మూడు రోజులుగా తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టో ర్నమెంట్ ఆదివారం ముగిసింది. నియోజకవర్గ స్థాయి, ఓపెన్ టు ఆల్ విభాగంలో మొత్తం 40 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో తాండూరు మండలం జినుగుర్తి జట్టు మొదటి స్థానం, తాండూరు పట్టణం సాయిపూర్కు చెందిన జాక్ పాట్ జట్టు రెండో స్థానాలలో నిలిచాయి. ఈ సందర్భంగా వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం చేతుల మీదుగా ఓపెన్ టు ఆల్ విభాగంలో మొదటి స్థానంలో మహబూబ్ నగర్ జట్టు, రెండో స్థానంలో శివారెడ్డి పేట్ కు చెందిన జట్లు నిలిచాయి. ఓపెన్ టూ ఆల్ విభాగంలో విజేత జట్టుకు రూ. 10 వేలు, రన్నర్ జట్టుకు రూ. 5 వేల నగదు, నియోజకవర్గ స్థాయి జట్లకు ట్రోఫీలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజం తరుపున క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. క్రీడాకారులు టోర్నమెంట్ ల ద్వారా క్రీడా నైపుణ్యాలను మెరుగు పరుచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. మరోవైపు వాలీబాల్ టోర్నమెంట్ ను విజయవంతంగా పూర్తి చేసిన సమాజం సభ్యులు మేడి విజయ్ కుమార్ ను సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమాజం గౌరవాధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు పరమేశ్వర్ స్వామి, పటేల్ విజయ్ కుమార్, ఘనాపూర్ శంకర్, కోటం సిద్ధలింగం, పటేల్ శివకుమార్, వీరశైవ యువదళ్ సభ్యులు పటేల్ కిరణ్ కుమార్, గంగా శ్రావణ్, వాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


