కల్తీ మద్యంపై దృష్టిసారించాలి
– మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
– బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కల్తీ మద్యం వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమ్ ప్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాండూరు పట్టణంలోని ఓ వైన్స్ షాపు పక్కన ఉన్న పర్మిట్ రూంలో వ్యక్తి మరణించిన సంఘటనపై స్పందించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించిన కల్తీ మద్యంపై సంబంధిత అధికారులు నిజాలను నిగ్గుతేల్చాలన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు నియోజకవర్గంలో నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మద్యం దుకాణాలు, కల్తీ మద్యం విక్రయాలపై అధికారులు దృష్టిసారించాలన్నారు. సమయ పాలన పాటించకుండా నిర్వహిస్తున్న దుకాణాలు, పర్మిట్ రూంలపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

