డ్రోన్లతో వ్యవసాయం..!
– అనుమతించిన కేంద్రం
– అన్నదాతలకు మరింత ప్రయోజనం
దర్శిని డెస్క్: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు డ్రోన్లను వినియోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రోన్ల వినియోగంతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. గత కొన్నేండ్ల నుంచి డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసేందుకు కేంద్రం దృష్టిసారించింది. అందరితో చర్చించిన తర్వాతే డ్రోన్ ఆపరేషన్ కు సంబంధించి SOP తీసుకువచ్చినట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తెలిపింది. అయితే వ్యవసాయంలో రెండేళ్లపాటు డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం మధ్యంతర ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ సమయాన్ని 18 ఏప్రిల్ 2022 నుంచి లెక్కిస్తారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్లో వ్యవసాయంలో డ్రోన్ని.. ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 18న దీని వినియోగానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి కేంద్రం మధ్యంతర ఆమోదం ఇవ్వడంతో పాటు దాని వినియోగానికి సంబంధించి SOP (standard operating procedures) కూడా జారీ చేసింది. రైతులు ఇప్పుడు పొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చని తెలిపింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. డ్రోన్లను ఉపయోగించి పురుగుమందుల పిచికారీ చేయడం వల్ల పంటలని కాపాడటమే కాకుండా తక్కువ జీవన వ్యయంతో రైతులు ఆదాయాన్ని కూడా పెంచవచ్చని చెబుతోంది. దీంతో పాటు డ్రోన్ టెక్నాలజీతో ఎరువులు పిచికారి చేయడంతో పాటు విత్తనాలను విత్తుకునే అవకాశం కూడ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

