రైతులకు తీపికబురు
– ఈ నెలాఖరులోగా రైతుబంధు
– రూ.7500 కోట్లు వానాకాలం పంట సాయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు కింద మరో విడత సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ నెల 20తర్వాత వానాకాలు సీజన్కు సంబంధించి రైతాంగానికి చెందిన ఖాతాల్లో నగదును జమచేసేలా సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. మొదటిరోజు ఎకరం లోపు భూమి కల్గిన రైతులకు, రెండో రోజు రెండెకరాలకు, మూడోరోజు మూడెకరాలకు ఇలా వరుసగా విధుల సర్దుబాటుతో రైతులకు ప్రయోజనం కల్గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యాసంగిలో 63లక్షల మందికి చెందిన 148 లక్షల ఎకరాలకు గానూ రాష్ట్ర ప్రభుత్వం.. రూ.7112 కోట్లు చెల్లింపులు చేసింది. ఈ పథకం ఆరంభమైన 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రభుత్వం చేసిన చెల్లింపులు మొత్తం రూ. 50, 448 కోట్లకు చేరుకుంది. 8 సీజన్లలో చెల్లింపులు చేసిన ప్రభుత్వం తాజాగా నెలకొన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ మహాయజ్ఞం విజయవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ చేస్తోంది. ఈ పథకం ద్వారా 53 శాతం మంది రైతులు బీసీ వర్గాలకు చెందిన వారుండగా, 13శాతం ఎస్సీ, ఎస్టీలు, 21 శాతం ఇతరులు ప్రయోజనం పొందుతున్నారు.

