మతవిద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు
– బండి సంజయ్పై చట్టరిత్య చర్యలు తీసుకోవాలి
– తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముస్లింల మనోభావాలు కించపరిచేలా, మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేయడం సరికాదని తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో మసీదులను ధ్వంసం చేస్తామని, మైనార్టీ రిజర్వేషన్లు, ఉర్దూ భాషను, మదర్సాలను తొలగిస్తామంటూ ఈ నెల 25వ తేదీన కరీంనగర్లో బహిరంగ ప్రకటన చేసిన సంజయ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింలంతా భారతీయులేనని, కొంతకాలంగా బండి సంజయ్ వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో కలిసిమెలిసి ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరుల్లో చిచ్చుపెట్టేలా మత విద్వేష ప్రకటనలు చేస్తున్నారని వివరించారు. మసీదులను తవ్వి అందులో దొరికే శవాలను మీరు తీసుకుని, శివలింగాలను తమకు ఇవ్వాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ, ప్రజలను గొడవలకు ఉసిగొల్పుతున్న సంజయ్పై చట్ట రీత్యా చర్యలు తీసుకుని, శాంతి భద్రతలు కాపాడాలని కోరారు.


