కొత్త ఫించన్ దారులకు తీపికబురు
– సీఎం కేసీఆర్ సమక్షంలో త్వరలో ప్రకటన
– దాదాపు 13 లక్షల మందికి లబ్ది
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: కొత్త ఫించన్ దారులకు తెలంగాణ సర్కారు త్వరలోనే తీపికబురు అందించేందుకు సన్నద్దమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త ఫించన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచనలు అందిస్తున్నాయి. ‘ఆసరా’ పింఛనను కొత్త వారికి ఇవ్వడంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. పింఛన్ల వయోపరిమితిని 57ఏండ్లకు తగ్గించనున్నట్లు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ అది అమల్లోకి రాలేదు. మే నెల నుంచి అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించారు. కాని అది సాధ్యం కాలేదు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి హరిష్ రావు కూడ జులై నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే జులై ప్రారంభం కావడంతో ఇప్పుడు కూడ మంజూరుకు అవకాశం దక్కలేదు. కొత్త ఫించన్ దారులకు ఆసరా మంజూరు చేసేందుకు దాదాపు ప్రక్రియ అంతా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం కసరస్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారిగా వివరాలను సేకరించింది. వచ్చే నెల నుంచి అమలు చేస్తే రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది కొత్త ఫించన్ దారులకు ఆర్థిక భరోసా లభిచింది. అయితే కొత్త ఫించన్ మంజూరుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి సమాలోచన జరిపేందుకు సీఎం కేసీఆర్ రెండు, మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తరువాత సర్కారు కొత్త ఫించన్ దారులకు తీపికబురు చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.



