టెన్ష‌న్.. టెన్ష‌న్..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

టెన్ష‌న్.. టెన్ష‌న్..!
– మున్సిప‌ల్ కుర్చీ మార్పుపై ఉత్కంఠ‌
– నేటితో ముగిసిన ఒప్పంద గ‌డువు
– ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పాచిక‌ల‌పైనే ఫోక‌స్‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిప‌ల్ రాజ‌కీయాల‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌రిగిన రెండున్న‌రేళ్ల ఒప్పందం నేటితో ముగియ‌డంతో కుర్చీ మార్పుపై ఉత్కంఠ‌త ఏర్ప‌డింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వికి స్వ‌ప్న ప‌రిమ‌ళ్, ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలుల మ‌ద్య‌ అప్ప‌ట్లో తీవ్ర పోటీ ఉండ‌డంతో ఇద్ద‌రి మ‌ద్య రెండున్న‌ర ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. గ‌డ‌వు స‌మీపించ‌డంతో కుర్చీ రాజ‌కీయం వేడెక్కింది. కుర్చీ దిగ‌లేమంటూ.. ఒక‌రు.. దిగిపోవాలంటూ మ‌రొక‌రు ఎత్తుల రాజ‌కీయం ప్రారంభించారు. ఈ వ్య‌వ‌హారం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వ‌ర్గీయుల మ‌ద్య తీవ్ర వివాదాస్పంద మారింది. ఒప్పందం ప్ర‌కారం దిగిపోవాలంటూ ఎమ్మెల్యే వ‌ర్గీయులు, ఎమ్మెల్సీ వ‌ర్గీయులు బీసీ కుల రాజ‌కీయాల‌ను తెర‌పైకి తెచ్చారు. అగ్రిమెంట్ ప్ర‌కారం మాట నిలుపుకోవాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో క‌లిసి వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు మంత్రి శ్రీ‌నివాస్ యాద‌వ్, స‌బితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిల‌ను క‌లిశారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటామ‌ని చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ ప‌ట్టుమీదుగా ఉన్నారు. ఎన్నిక‌ల్లో చేసుకున్న ఒప్పందానికి బుధ‌వారంతో గ‌డువు ముగిసింది. దీంతో తాండూరులో మ‌ళ్లీ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఆస‌క్తి రేపుతున్న మంత‌నాలు
రెండున్న‌రేళ్ల గ‌డువు తీర‌డంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వ‌ర్గీల మ‌ద్య కీల‌క మంత‌నాలు ప్రారంభ‌మ‌య్యాయి. మంగ‌ళ‌వారం రాత్రే ఎవ్వ‌రి వ‌ర్గీయుల‌లో వారు స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రుపుకున్నారు. రాత్రి ప‌ట్ట‌ణంలోని మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్నామాల న‌ర్సింలు నివాసంలో భేటీ అయ్యారు. బుధ‌వారం తాండూరు ఎమ్మెల్యేతో ప‌ట్లోళ్ల న‌ర్సింలు, వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు స‌మావేశ‌మైయ్యారు. ఇదిలా ఉండ‌గా ఓ వైపు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని క‌లిసేందుకు ఆయ‌న వ‌ర్గీయులు న‌గ‌రానికి బ‌య‌ల్దేరారు. మ‌రోవైపు ఎమ్మెల్యే వ‌ర్గీయులు కూడ మంత్రి స‌బితారెడ్డిని క‌లిసేందుకు బ‌య‌ల్దేరారు. ఇరు వ‌ర్గాలు కుర్చీ రాజ‌కీయాన్ని తేల్చుకునేందుకు అధిష్టానం వ‌ద్ద‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రి వ‌ర్గీయుల‌కు ఎలా న్యాయం చేయాల‌ని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎత్తుల‌పై అంద‌రి పోక‌స్ ఏర్ప‌డింది.