భార్య, భర్తలను మింగిన కాగ్నానది
– వాగులో కొట్టుకువచ్చిన మృతదేహాలు
– వికారాబాద్ జిల్లా మంతట్టిలో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న కాగ్నానది ఓ ఇద్దరు భార్య, భర్తలను మింగేసింది. వాగు దాటుతుండగా నీటి ప్రవాహానికి ఇద్దరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతటి – తాండూరు మండలం చంద్రవంచ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే మంతట్టి గ్రామానికి చెందిన నాటికేరీ బుగ్గప్ప, యాదమ్మలు భార్య భర్తలు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వీరికి మంతట్టి సమీపంలోని మూలగడ్డ వద్ద ఉన్న వ్యవసాయ పొలంలో కూరగాయలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుగ్గప్ప, యాదమ్మలు రాత్రి పగలు ఎక్కువగా పొలం వద్దే ఉండేవారు. పొలంలో పండించిన కూరగాయలను కాగ్నావాగును దాటుకుంటూ వెళ్లే తాండూరు మండలం చంద్రవంచలో విక్రయించే వారు. ఈ క్రమంలో ఆదివారం బుగ్గప్ప, యాదమ్మలు చంద్రవంచకు వెళ్లారు. సోమవారం ఉదయం చంద్రవంచ నుంచి మంతట్టికి వాగుదాటేందుకు ప్రయత్నించారు. అదేరోజు వాగులోకి వరధనీరు ఉధృతంగా చేరింది. నీటి ప్రవాహాంలో వాగుదాటుతున్న బుగ్గప్ప, యాదమ్మలు వాగులో గల్లంతు అయ్యారు. తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్న కుమారుడు వాగు సమీపంలో మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు తెలిసింది. కర్ణాటక రాష్ట్రం జట్టూరు వద్ద వాగు ఒడ్డున వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్ణాటక సులేపేట్ చందానగర్ ఆసుపత్రికి తరలించారు.



