రెండు రోజులు భారీ వర్షాలు
– ప్రకటించిన వాతారణ కేంద్రం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. వాయుగుండంగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం బలపడిందని, క్రమంగా ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని వెల్లడించింది. ఇది బాలాసోర్కి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కి.మీ, సాగర్ దీవులకు ఆగ్నేయ దిశగా 150కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 6 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లోని బాలాసోర్, సాగర్ ద్వీపం మధ్యన తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.


