పది పరీక్ష పేపర్ల కుదింపు
– ఆరు పేపర్ల నిర్వహణకు ఆమోదం
– కీలక నిర్ణయం తీసుకున్న సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 11 పేపర్ల విధానంలో కొనసాగుతున్న పరీక్షలను ఇక నుంచి 6 పేపర్లకు కుదించింది. కొత్త విధానంలో పదోతరగతి పరీక్షలు నిర్వహణ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ఎన్సీఈఆర్టీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఎస్ఏ-1 కూడా పదోతరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించారు.

