కేంద్రం నిధులు పక్కదారి పట్టిస్తే సహించం
– అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
– బీజేపీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి యు. రమేష్ కుమార్
– తాండూరులో జాతీయ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధి కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో శరవేగంగా కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను పార్టీ నేతలతో కలిసి యు. రమేష్ కుమార్ పరిశీలించారు. విస్తరణలో భాగంగా వ్యాపారులు కూల్చివేతలకు సహకరించడం అభినందనీయమని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు ప్రాంతానికి కేంద్రం జాతీయ రహదారిని మంజూరు చేయడమే కాకుండా నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటురాని ఆరోపణలు వస్తున్నాయని, అలా చేస్తే చూస్తూ సహించేదని లేదని హెచ్చరించారు. తాండూరు నియోజక వర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చొరవ చూపడంలేదని విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పదవి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. ఉప ఎన్నికలతో వచ్చే నిధులతో తాండూరు అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పూజారి పాండు. అంతారం కిరణ్, బాసు తదితరులు పాల్గొన్నారు.

