పెద్దేముల్ గురుకులాన్ని మా ప్రాంతానికి తరలించండి
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ ప్రాంతానికి చెందిన గురుకుల పాఠశాలను తిరిగి తాండూరుకు తరలించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ కోరారు. నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనం లేక చేవెళ్లకు తరలించారు. బుధవారం చేవేళ్ల మండలం ప్రజ్ఞాభారతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న పెద్దేముల్ గురుకుల పాఠశాలను రాజ్ కుమార్ సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి భోజనం, తాగునీటి ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 300 మందికి సరిపోయే భవనంలో 1000 మందితో నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. అనంతరం నిర్వహకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పెద్దేముల్ గురుకుల పాఠశాలను తిరిగి తాండూరు నియోజకవర్గానికి మార్చాలని కోరారు. తాండూరు ఎమ్మెల్యే సైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో పాఠశాలను తరలించేందుకు కృషి చేస్తామని రాజ్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

