నేరాల పట్ల అప్రమత్తత అవసరం
– చెడు మార్గాన్ని వీడి లక్ష్యాలను నెరవేర్చుకోవాలి
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో జరిగే నేరాలపై అందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులకు పట్టణ పోలీసు శాఖ, షీటీం, చైల్డ్ లైన్, కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, డయల్ 100, రోడ్డు నిబంధనలు తదితర అంశాలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ హాజరై విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు నేటి కాలంలో జరిగే వివిధ రకాల నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సాంకేతికతతో జరిగే మోసాలపై అందరు అప్రమత్తం కావాల్సిన అవసరముందన్నారు. సెల్ ఫోన్, సిగరేట్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్, పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ రాజమోహన్, షీటీం, చైల్డ్ లైన్ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


