ఈనెల 11న ఎస్సై, కానిస్టేబుళ్లకు తుది రాతపరీక్షలు
– ప్రకటించిన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
– 6వ తేదిన హాల్టిక్కెట్ల డౌన్లోడ్కు అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలోని 19,969 ఎస్సై, పోలీసు కానిస్టేబుళ్లకు ఈనెల 11న తుది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీ అండ్ సీవో), ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ విభాగాలకు ఈ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఐటీ అండ్ సీఓ విభాగం ఎస్సై తుది రాతపరీక్ష 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఫింగర్ ప్రింట్ బ్యూరో (ఎఫ్పీబీ) ఏఎస్సై తుది రాతపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 30 గంటల నుంచి సాయంత్ర 5 గంటల 30 నిముషాల వరకు జరగనున్నట్లు వెల్లడించింది. అయితే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మార్చి 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 9వ తేదీ రాత్రి 12 గంటల వరకు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చిన బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు సూచించారు. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాస్పోర్టు సైజ్ ఫొటో అతికించాలని, హాల్ టికెట్ల డౌన్లోడులో ఇబ్బందులెదురైతే 93937 11110 లేదా 93910 05006 నంబర్లను సంప్రదించాలన్నారు. ఐటీ అండ్ సీవో ఎస్సై, ఎఫ్పీబీ ఏఎస్సై తుది రాతపరీక్షకు సంబంధించిన మరో రెండు పేపర్ల హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వివరించారు. తెలంగాణలో 19,969 ఎస్సై, పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలు నిర్వహిస్తున్నారు.

