వడ్డీ ద్వారానే రూ. 41 లక్షలు సొంతం..!
– రోజుకు 250 రూపాయిలే పెట్టుబడి
– సుకన్య సమృద్ధి యోజనలో బంపర్ ఆఫర్
– పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రయోజనం
– అర్హులు, పథకం అమలు గురించి తెలుసుకోండి
దర్శిని డెస్క్: రోజూ రూ. 250లు పెట్టుబడి పెడితే చాలు.. 21 ఏండ్లకు రూ. 65 లక్షలు పొందే అవకాశం కేంద్రం ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందులో వడ్డీ ద్వారానే దాదాపు 41.15 లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని కొత్తకొత్త పథకాలను అమలు చేస్తూనే ఉంది. ఆడపిల్లలకు చదువు, పెళ్లి అనే ఆందోళన నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సుకన్య సమృద్ధి యోజన అమలు చేస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పథకంలో కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఖాతా తెరవవచ్చు. ఈ పథకంలో ఖాతా తెరిచేటప్పుడు, మీ కుమార్తె పేరు మీద డబ్బు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలోనే మీరు రోజూ కేవలం రూ. 250 రూపాయల పెట్టుబడితో 65 లక్షల రూపాయలను పొందవచ్చు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? :
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల ఆమె తల్లిదండ్రుల ద్వారా ఖాతా తెరవవచ్చు. కేవలం 250 రూపాయల పెట్టుబడితో ఖాతా తెరవవచ్చు. ఈ ఖాతాను ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు . దీనిపై మీకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల పేరిట ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. ఒక ఇంట్లో కేవలం 2 ఆడ పిల్లల ఖాతాలను మాత్రమే తెరిచే వీలుంది. కవల/ముగ్గురు ఆడపిల్లల విషయంలో 2 కంటే ఎక్కువ ఖాతాలను తెరవవచ్చు. ఇందుకోసం 1. తల్లి, తండ్రి గుర్తింపు కార్డు 2. కుమార్తె ఆధార్ కార్డు 3. కుమార్తె పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతా పాస్బుక్ 4. కుమార్తె పాస్పోర్ట్ సైజు ఫోటో 5. మొబైల్ నంబర్ అవసరం అవుతోంది.
ఎంత వడ్డీ వసూలు చేస్తారు?
సుకన్య సమృద్ధి యోజనలో వసూలు చేసే వడ్డీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనిపై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. కుమార్తెకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే ఈ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
65 లక్షల రూపాయలు వస్తాయంటే..?
ఈ పథకంలో రోజూ రూ.250 ఇన్వెస్ట్ చేస్తే నెలలో రూ.12,500, ఏడాదికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాలకు మీ పెట్టుబడి 22.5 లక్షలు. మెచ్యూరిటీ సమయంలో అంటే 21 ఏళ్ల వయస్సులో మీరు రూ.65 లక్షలు పొందుతారు. ఇందులో దాదాపు 41.15 లక్షల రూపాయలు వడ్డీగా అందుతాయి.

