వాట్సాప్తో జాగ్రత్త..!
– ఏది పడితే అది షేర్ చేస్తే జైలే
– అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
దర్శిని డెస్క్: ప్రస్తుతం ఎవరిని చూసినా వాట్సాప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవస్థతో ఎంత ఉపయోగం ఉందో.. అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రమాదం ఉందని కొన్ని సంఘటనలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్నారు. కొంత మంది యూజర్లు తమకు వచ్చిన కంటెంట్ నిజమైందా.? కాదా అని కూడా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. అయితే కొన్ని రకాల మెసేజ్లను సెండ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు వాట్సాప్ సూచిస్తోంది. కొన్ని కేటగీరిల్లోని కంటెంట్ను వెనకాముందు ఆలోచించకుండా షేర్ చేస్తే శిక్షలు కూడా తప్పవని హెచ్చరిస్తోంది.
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి సంబంధించిన కంటెంట్ను లేదా వారిని ప్రోత్సహిస్తున్నట్లున్న సమాచారాన్ని షేర్ వాట్సాప్లో షేర్ చేస్తే సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంటెంట్ మన వాట్సాప్కు వచ్చినా వాటిని వదిలేయడమే ఉత్తమం. దేశ భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఇలాంటి కంటెంట్ షేరింగ్పై నిఘా పెడుతోందని గుర్తించాలి.
ఎదుటి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా మెసేజ్లు చేసినా చిక్కుల్లో పడుతారు. ఉదారహణకు ఎవరినైనా ఆటపట్టించడం కోసం వారికి తెలియకుండా వారి వీడియోలు తీసి గ్రూప్స్లో షేర్ చేయకూడదు. ఇలా చేయడం ద్వారా సదరు వీడియోలను కొందరు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి సరదాకు కూడా ఇలాంటి పని చేయకండి.
వాట్సాప్ గ్రూప్స్లో ఎట్టి పరిస్థితుల్లో అశ్లీల కంటెంట్ను షేర్ చేయకూడదు. సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్ షేర్ చేయడం చట్టరీత్యా నేరం. గ్రూప్లో ఉన్న వారు ఎవరైనా పోలీసులకు సదరు వీడియోలపై ఫిర్యాదు చేస్తే.. గ్రూప్ అడ్మిన్తో పాటు, షేర్ చేసిన వ్యక్తిపై చర్యలు తప్పవు. ఫేక్ న్యూస్ వల్ల చిక్కుల్లో పడ్డ ఎన్నో ఘటనలు జరిగాయి. అందుకే నకిలీ వార్తలను షేర్ చేయవద్దు. కులమతాలు, వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు కూడా చేయవద్దు.
ఎవరు పడితే వారు మిమ్మల్ని వాట్సప్ గ్రూప్లో యాడ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. అయితే అలా గ్రూపుల్లో యాడ్ చేస్తున్నట్లయితే ప్రైవసీ సెట్టింగ్స్లో మిమ్మల్ని ఎవరు గ్రూప్లో యాడ్ చేయాలో పర్మిషన్ ఇవ్వొచ్చు.
మీకు అవసరం లేని మెసేజెస్ సేవ్ చేయకండి. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్తో మీ వాట్సప్ మెసేజెస్ ఎప్పటికప్పుడు డిలిట్ అయ్యేలా సెట్టింగ్స్ చేయవచ్చు. అందుకే వాట్సాప్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అందరికీ మీ వాట్సప్ నెంబర్ ఇవ్వకండి. మీరు ఇటీవల కాలంలో కాంటాక్ట్లో లేనివాళ్ల నెంబర్స్ డిలిట్ చేయండి. రెండుమూడేళ్ల క్రితం మిమ్మల్ని వాట్సప్లో కాంటాక్ట్ అయినవారితో ఇప్పుడు ఎలాంటి పని ఉండకపోవచ్చు. అలాంటి నెంబర్స్ డిలిట్ చేయడం మంచిది. దీంతో మీ వాట్సప్ క్లీన్గా ఉంటుంది.
కాపీరైట్ ఉన్న కంటెంట్ను షేర్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సూచిస్తోంది. కొందరు క్రియేటర్లు తమ కంటెంట్ అనుమతి లేకుండా షేర్ చేశారని ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

